ఆక్రమణలను గుర్తించేందుకు.. త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ

by Shiva |
ఆక్రమణలను గుర్తించేందుకు.. త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలీటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, కుంటలు, నీటి వనరుల సంరక్షణకు పురపాలక, పట్టణాభివ్రద్ధి శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పరిరక్షణ, ఫెన్సింగ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపుపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైడ్రా ఏర్పడిన తర్వాత హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం ద్రష్టి సారించింది. అందులో భాగంగానే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు రాకుండా ఉండేందుకు ‘త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్‘ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని పురపాలక, పట్టణాభివ్రద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ప్రకటించిన విషయం సంగతి విదితమే. అందుకు సంబంధించి ప్రక్రియను అధికారులు కూడా మొదలు పెట్టారు.

డ్రోన్ సర్వే..

హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3 వేలు, జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులు ఉన్నాయి. వీటిలో సగం చెరువులకు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపు పూర్తికాకపోవడంతో పాటు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయితే అన్ని చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డ్రోన్ల ద్వారా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వేలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, పూర్తిస్థాయి నీటి మట్టం, హద్దులు గుర్తించారా.. ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా? అనే అంశాలను గుర్తించాలని నిర్ణయించారు.

360 డిగ్రీలు.. త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్

డ్రోన్ల సర్వే తర్వాత హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి చెరువుకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని గుర్తించడానికి ‘త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్‘ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీంతో ప్రతి మూడు నెలలకొసారి త్రీ డీ ఫొటోలు తీయాలా..? 6 నెలలకు ఒకసారి త్రీడీ ఫొటోలు తీయాలా? అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత చెరువులకు సంబంధించిన 360 డిగ్రీల కోణంలో చిత్రపటాన్ని పరిశీలించనున్నారు. ఏమైనా ఆక్రమణలు వస్తే ఎప్పుడు వచ్చాయి.. ఏ దిక్కునా వచ్చాయి.. ఎంత స్థలాన్ని ఆక్రమించారు? అంశాలను శాటిలైట్ ద్వారా గుర్తించనున్నారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలను హైడ్రాకు అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఏజెన్సీని గుర్తించే పనిలో..

త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీని అమలు చేసే బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వనున్నారు. ఈ ఏజెన్సీని గుర్తించడానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని మహారాష్ట్రలోని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వినియోగిస్తున్నారు. అక్కడ అమలు చేస్తున్న తీరును తెలంగాణ అధికారులు అధ్యయనం చేయనున్నారు.

నిర్మాణాలకు కట్ ఆఫ్ డేట్ ఫిక్స్.. హైడ్రా కసరత్తు

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలో చెరువులు, కుంటలు, నీటి వనరుల పరిరక్షణ హైడ్రా మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటి వరకు ఆక్రమించిన భవనాలు కాకుండా భవిష్యత్తులో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు రాకుండా హైడ్రా కట్ ఆఫ్ డేట్ ఫిక్స్ చేయనుంది. హైడ్రా ప్రకటించిన డేట్ తర్వాత ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు వస్తే అందుకు అనుమతులిచ్చిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది.

కట్ ఆఫ్ డేట్ ఎప్పటి వరకు ఉండాలి.. ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? ఉల్లంఘించిన అధికారులపై ఏలాంటి చర్యలు తీసుకోవాలి? లేన్ డిపార్ట్‌మెంట్స్ సహకారం వంటి అంశాలపై న్యాయ నిపుణులతో హైడ్రా చర్చలు చేస్తుంది. నెల రోజుల్లో దీనికి సంబందించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన నిర్మాణాలను గుర్తించడానికి హైడ్రా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్ఏ సంస్థలతో సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో పాటు హైడ్రా సంస్థ 19 జులై 2024లో ఏర్పాటైంది.

అంతకు ముందు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టొద్దని అంక్షలు కూడా ఉన్నాయి. కానీ, వాటిని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఇక నుంచి హైడ్రా చర్యలు కట్టుదిట్టం చేయనుంది. దీంతో పాటు తెలంగాణలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైడ్రా ఆపరేషన్ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాళ తీసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లీగల్‌గా ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అనుమతులు పొందిన భవనాలపై ఏలాంటి చర్యలు తీసుకోబోమని హైడ్రా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed